'గుడ్ మార్నింగ్ గోదావరి' తో సమస్యలకు గుడ్ బై
- 13వ వార్డులో పర్యటించిన ఎంపీ భరత్, కమిషనర్ దినేష్ కుమార్
రాజమండ్రి, ఏపీ పబ్లిక్ న్యూస్ : ప్రతీ వార్డులో సమస్యలను స్వయంగా పరిశీలించి సత్వర పరిష్కారం కోసమే 'గుడ్ మార్నింగ్ రాజమండ్రి' కార్యక్రమమని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. మంగళవారం ఉదయం నగరంలోని 13వ వార్డు షెల్టాన్ హోటల్ హెచ్పీ పెట్రోల్ బంకు ఎదురుగా అంబేడ్కర్ విగ్రహం వద్ద నుండి 'గుడ్ మార్నింగ్ రాజమండ్రి' కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర పాలక సంస్థ కమిషనర్ కే దినేష్ కుమార్, మున్సిపల్ కార్పొరేషన్ వివిధ విభాగాల అధికారులు, వైసీపీ నేతలతో కలిసి ఎంపీ భరత్ ఆ వార్డులో పర్యటించారు. శానిటేషన్ సిబ్బంది పనితీరు, డ్రెయినేజీలు, వీధిలైట్లు తదితర సమస్యలను ఎంపీ, కమిషనర్ ఆ వార్డు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ 'గుడ్ మార్నింగ్ రాజమండ్రి' కార్యక్రమం నిత్యం ఏదో ఒక వార్డులో జరుగుతుందన్నారు. నగరంలో 50 వార్డులకు శానిటేషన్ సిబ్బంది వెయ్యిమంది వరకూ ఉన్నారని, వారు ఏ మేరకు వార్డులలో తమ విధులు నిర్వహిస్తున్నారో తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఆకస్మిక తనిఖీగా ఈ వార్డుల పర్యటన ఉంటుందని చెప్పారు. ముందుగా చెబితే తాము వచ్చే వార్డునే శుభ్రం చేస్తారనే ఉద్దేశంతో సడెన్ విజిట్ ద్వారా ప్రజల ఇబ్బందులు తెలుసుకుని, వాటిని అక్కడికక్కడే పరిష్కరిస్తామని ఎంపీ భరత్ తెలిపారు. ప్రధానంగా శానిటేషన్, డ్రెయినేజీ, వీధిలైట్ల సమస్య..ప్రజలకు ఇవే ముఖ్య అవసరాలు కాబట్టి వాటిపై దృష్టి సారిస్తున్నట్టు ఎంపీ భరత్ చెప్పారు. కమిషనర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ ఉదయమే ప్రజలను కలుసుకుని ముచ్చటించేందుకు 'గుడ్ మార్నింగ్ రాజమండ్రి' చక్కని కార్యక్రమమని అన్నారు. ఎంపీ భరత్ ఆలోచనల నుండి పుట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు నగర పాలక సంస్థ ప్రధానంగా అందిస్తున్న వాటర్, పారిశుధ్యం, మురుగు కాలువల సమస్యలపై మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఏ విధంగా పనిచేస్తున్నారో తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయా వార్డులలో సమస్యలు తెలుసుకునే వీలుంటుందని చెప్పారు. తద్వారా మున్సిపల్ అధికారులు, సిబ్బంది పనితీరు మెరుగుపర్చడంతో పాటు ప్రజల సమస్యలను సాధ్యమైనంత త్వరితంగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుందన్నారు. 'గుడ్ మార్నింగ్ రాజమండ్రి' ప్రతి రోజూ ఉదయం కొనసాగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ దినేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర శాఖ అధ్యక్షుడు అడపా శ్రీహరి, ఆ వార్డు ఇన్చార్జి మార్తి లక్మి, మార్తి నాగేశ్వరరావు, మజ్జి అప్పారావు, అన్నపూర్ణ రాజు, బిల్డర్ చిన్న, ఉల్లూరి రాజు, దుంగా సురేష్, ఎన్వీ శ్రీనివాస్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.