సమిశ్రగూడెం గ్రామంలో ఆగని బలవంతపు వసూళ్లు, సొమ్ములు తిరిగి ఇచ్చేయమని పెద్దన్న చెప్పిన వినని వైనం

సమిశ్రగూడెం గ్రామంలో ఆగని బలవంతపు వసూళ్లు, సొమ్ములు తిరిగి ఇచ్చేయమని పెద్దన్న చెప్పిన వినని వైనం

👉సమిశ్రగూడెం లో ఆ నాయకుడు చెప్పిందే వేదమా?

👉పెద్దన్న వద్దన్నా వినడం లేదా?

👉 స్వచ్ఛందంగా ఇస్తున్నాము అంటూ బలవంతంగా సంతకాలు సేకరణ?






ఏపీ పబ్లిక్ న్యూస్,  నిడదవోలు అక్టోబర్ 24 :
నిడదవోలు మండలం, సమిశ్రగూడెం గ్రామంలో అట్లపాడు రోడ్డులో వికాస్ స్కూల్ పక్కన పాత వైయస్సార్ కాలనీకి గత 18 సంవత్సరాల నుండి డ్రైనేజీ, రోడ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు, నాయకులకు ఎన్నో సార్లు వినతులు పెట్టుకున్న సమస్య పరిష్కారం అవ్వలేదు. ప్రజల తిరుగుబాటుతో జిల్లా పరిషత్ నిధులు 6 లక్షలు గ్రామ పంచాయతీ నిధులు 6 లక్షలు మొత్తం 12 లక్షలు కేటాయించారు. కానీ ఆ మొత్తం సరిపోదంటూ ఆ గ్రామ నాయకుడు (కాంట్రాక్టర్) ఆ కాలనీ వాసుల వద్ద నుండి బలవంతంగా ఇంటికి 7000 రూపాయలు చొప్పున వాలంటీర్ ద్వారా వసూలు చేస్తున్నారు. అక్కడ 100 మంది లబ్ధిదారులు ఉన్నారు. డబ్బులు ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడతారని బెదిరిస్తున్నట్టు సమాచారం. స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా ఇస్తున్నాం అని లబ్ధిదారులను బెదిరించి సంతకాలు తీసుకుంటున్నారని సమాచారం. ఈ విషయంపై గ్రామ కార్యదర్శికి వివరణ కోరగా ప్రభుత్వం డబ్బులతోనే రోడ్లు వేస్తున్నామని ఎవరి వద్దా ఎటువంటి వసూళ్లు చేయడం లేదని ఆలా ఎవరైనా చేసినట్టు రుజువైతే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. స్థానికుల సమాచారం బట్టి ఇప్పటి వరకు 80 మంది లబ్ధిదారుల వద్ద డబ్బులను వసూలు చేసినట్టు తెలిసింది. అందరికి తెలిసే ఈ వసూళ్లు జరుగుతున్నాయని, గ్రామంలోని నాయకుడు దీని వెనుక ఉండి నడిపిస్తున్నారని, ఆ నాయకుడికి వ్యతిరేకంగా ప్రజలు ముందుకు రావడానికి భయపడుతున్నట్టు లబ్ధిదారులు తెలియచేసారు. గతంలో కూడా అదే గ్రామంలో ఒక వీధికి సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్డు వేయడానికి ఒక్కొక్క ఇంటి నుండి పదివేల రూపాయలు వసూలు చేసినట్టు సమాచారం ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ వసూళ్లకు అడ్డు కట్ట వేయాలని, వసూలు చేసిన సొమ్మును తిరిగి ఇప్పించాలని కోరుతున్నారు.