బాణాసంచా విక్రయశాలల ఏర్పాట్లలో ప్రత్యేక శ్రద్ధ - రాజమండ్రి ఎంపీ భరత్

 బాణాసంచా విక్రయశాలల ఏర్పాట్లలో ప్రత్యేక శ్రద్ధ

- పటిష్టమైన చర్యలు

- రాజమండ్రి ఎంపీ భరత్




ఏపీ పబ్లిక్ న్యూస్, తూర్పు గోదావరి జిల్లా, నవంబర్ 11 :

రాజమండ్రి, నవంబరు 9: ఎటువంటి ప్రమాదాలు జరగకుండా దీపావళి మందుగుండు సామాగ్రి విక్రయ దుకాణాల ఏర్పాటు విషయంలో ముందస్తు చర్యలు, జాగ్రత్తలు తీసుకున్నట్టు వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. శుక్రవారం నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బాణాసంచా విక్రయశాలలను‌ సందర్శించారు. వ్యాపారులతో ముచ్చటించారు. ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలకు బాణాసంచా విక్రయాలకు రాజమండ్రి ప్రధాన కేంద్రంగా గుర్తింపు పొందిందని, ఇక్కడ నుంచే వివిధ ప్రాంతాల నుండి ప్రజలు, వ్యాపారులు వచ్చి కొనుగోలు చేసుకు వెళ్ళతారని చెప్పారు. గతంలో అయితే బట్టల షాపుల మధ్యన, సమీపంలో ఇష్టం వచ్చినట్లు బాణాసంచా వ్యాపారాలు నిర్వహించే వారని, దానివల్ల అనేక ప్రమాదాలు, ఇబ్బందులు ఉండేవన్నారు. వాటినన్నిటినీ దృష్టిలో ఉంచుకుని నగరంలో విశాలమైన ప్రాంతాలను గుర్తించి వ్యాపారులకు బాణాసంచా విక్రయించుకునేలా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో 59 షాపులు, నాగుల చెరువు బజారులో 30, వీఎల్ పురం లారీ స్టాండ్ లో 20, అలాగే సుబ్రహ్మణ్యం మైదానంలో మరికొన్ని షాపుల ఏర్పాటుకు వెసులుబాటు కల్పించినట్టు ఎంపీ భరత్ తెలిపారు. దీపావళి పండుగ అందరికీ ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేయాలనే ఉద్దేశంతో తగు జాగ్రత్తలు, చర్యలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు.